1, మార్చి 2014, శనివారం

తెలుగు పద్యాలను అర్థం చేసుకోలేని అర్ధ మేధావులే గొల్లలను తప్పుదోవ పట్టించారు.



         తెలుగు చాలా భాషల కంటే అధునాతన భాష. ప్రపంచం లోనే ఏ భాష లో కూడా లేనటువంటి సాహిత్య ప్రక్రియలను కలిగినటుమవంటి ఏకైక భాష. 

        అలాంటి తెలుగు భాషలో నిష్ణాతులమని చెప్పుకున్న కొంతమంది "పారిజాతాపహరణాన్ని"  అర్థం  చేసుకోలేక పాపం గొల్ల కులస్తులను తప్పుదోవ పట్టించారు. తమ ఉనికి కొరకు తమకు తెలిసిన వాటినే పుస్తకాలుగా రాశారు. అలాంటివారిని కొంతమందిని మేము గుర్తించాము. వారిని పేర్లతో సహా ఇక్కడ ప్రచురించి కడిగి వేయాలని మొదట అనుకున్నాము. కానీ వారు గౌరవప్రదమైన వృత్తులలో జీవిస్తున్నారు. సమాజం లో గౌరవాన్నీ ఆస్వాదిస్తున్నారు. వారి వయసు రీత్యా వారిని అవమానించ కూడదని అది సంస్కారం కాదని వారు కావాలని ఆ తప్పులు చేసి వుండక పోవచ్చని పొరపాటుగా తమ పుస్తకాలను ప్రచురించారని మేము భావిస్తున్నాము. అలాంటి రచయితలు ఒక్క సారి తమ తప్పులను తెలుసుకుని సరిదిద్దుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలా సరిదిద్దుకోని పక్షం లో వున్న గౌరవాన్ని ముందు తరాల ముందు కోల్పోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాము.  


                                                                                                                   -బ్లాగు నిర్వాహకుడు   

శ్రీకృష్ణదేవరాయల వంశ వివరణ


పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన

           పారిజాతాపహరణము  శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి అయిన ముక్కుతిమ్మన చే వ్రాయబడినది.  
ఇందు వర్ణించిన వర్ణన ప్రకారం శ్రీమహావిష్ణుమూర్తి ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా యయాతి పెద్దకుమారుడైన యదువు వంశములో వసుదేవుని ఇంట పుట్టినప్పటికీ అతను చిన్నతనములోనే నందుని ఇంట పెరిగినందున సింహాసనం ఎక్కి రాజ్యాన్ని పరిపాలించే అర్హత పొందలేకపోయెను, మరల అదే  శ్రీ మహావిష్ణుముర్తి కలియుగములో యయాతి రెండవ కుమారుడైన తుర్వసుని వంశపరంపరలో నరసనాయకుని ఇంట శ్రీకృష్ణదేవరాయలుగా అవతరించి సింహాసనంఎక్కి రాజ్యాన్నిపరిపాలించే అర్హత పొందెను అని ద్వాపరయుగములో జరిగిన శ్రీకృష్ణుని వర్ణనలతో, కలియుగములోని శ్రిక్రిష్ణదేవరయలను పోలుస్తూ(తులానాత్మక వర్ణన) అద్భుతమైన వర్ణనలతో పారిజాతాపహరణము రచించెను 

పారిజాతాపహరణము కృతిపతియగు శ్రీకృష్ణదేవరాయల  వంశ ప్రశస్తి గురించి వివరించిన పద్యాలు

ఆ యమృతాంశునం దుదయమయ్యె బుధుం, డతఁ డార్తరక్షణో
పాయుఁ బురూరవుంగనియె, నాతని కాయువు పుత్త్రుఁ డయ్యె, న
య్యాయతకీర్తికి న్నహుషుఁ డాత్మజుఁడై యిలయేలెఁ, దత్సుతుం
డై యలరె న్యయాతి, యతఁడాహవదోహలుగాంచెఁ దుర్వసు\న్‌.

     (ఈ పద్యములో చంద్రునికి బుధుడు, యీతనికి పురూరవుడు, యీతనికి ఆయువు, యీతనికి నహుషుడు, యీతనికి యయాతి పరంపరగా పుట్టినట్టు వర్ణించెను. ఈ యయాతికి తుర్వసుడు పుట్టెను అని తెలిపెను. అనగా యయాతికి యదు, తుర్వసు, అను, ద్రుహ్యు, పురులను ఐదుగురు కుమారులలో తుర్వసుని మాత్రమే ఇక్కడ శ్రిక్రిష్ణదేవరాయల వంశానికి మూలపురుషునిగా తెలిపెను )   

ఉర్వీశమౌళి యగు నా
తుర్వసు వంశంబునందు దుష్టారి భుజా
దుర్వార గర్వ రేఖా
నిర్వాపకుఁ డీశ్వరాఖ్య నృపతి జనించె\న్‌.
(ఈ పద్యములో తుర్వసు వంశమున ఈశ్వర పుట్టెను అని తెలిపెను).

శాశ్వత విజయుఁడు తిమ్మయ
యీశ్వర నృపతికిని గౌరి కెన యగు తత్ప్రా
ణేశ్వరి లక్కాంబికకు
న్విశ్వాతిగ యశుఁడు సరసవిభుఁ డుదయించె.

(ఈ పద్యములో తిమ్మయ కుమారుడు ఈశ్వర ఈతని భార్య లక్కంబిక ద్వారా నరసా నాయక పుట్టెను అని తెలిపెను).

ఆ నరస మహీమహిళా
జానికిఁ గులసతులు పుణ్యచరితలు తిప్పాం
బా నాగాంబిక లిరువురు
దానవ దమనునకు రమయు ధరయును బోలె\న్‌.

(ఈ పద్యములో నరసా నాయక భార్యలు తిప్పాంబా, నాగాంబిక అని తెలిపెను).

వారలలోఁ దిప్పాంబ కు
మారుఁడు పరిపంథి కంధి మంథాచలమై
వీరనరసింహరాయుఁడు
వారాశి పరీశ భూమి వలయం బేలె\న్‌.

(ఈ పద్యములో తిప్పాంబా కుమారుడు వీరనరసింహరాయుఁడు అని తెలిపెను).

వీర శ్రీనరసింహశౌరి పిదప న్విశ్వంభరా మండలీ
ధౌరంధర్యమున\న్‌ జనంబు ముదమంద న్నాగమాంబా సుతుం
డారూఢోన్నతిఁ గృష్ణరాయఁడు విభుండై రత్న సింహాసనం
బారోహించె, విరోధులు న్గహన శైలారోహముం జేయఁగ\న్‌.

(ఈ పద్యములో నాగాంబిక కుమారుడు గృష్ణరాయఁడు అని తెలిపెను).

యాదవత్వమున సింహాసనస్థుఁడు గామి - సింహాసనస్థుఁ డై చెన్ను మెఱయ
గొల్ల యిల్లాండ్రతోఁ గోడిగించుటఁ జేసి - పరకామినీ సహోదరతఁ జూప
మఱి జరాసుతునకై మథుర డించుటఁ జేసి - పరవర్గ దుర్గము ల్బలిమిఁ గొనఁగఁ
బారిజాతము నాసపడి పట్టి తెచ్చుట - నౌదార్యమున దాని నడుగు వఱుపఁ

       ఇందు శ్రీ మహావిష్ణుముర్తి ద్వాపరయుగమున శ్రీకృష్ణునిగా యయాతి పెద్ద కుమారుడైన యదువంశములో వసుదేవుని ఇంట పుట్టినప్పటికీ అతను చిన్నతనములోనే నందుని ఇంట పెరిగినందున కలిగిన యాదవత్వము (అనగా తిమ్మన్న గారి దృష్టిలో పశువులు మేపుకొను వృత్తి అయి వుండవచ్చు ) వల్ల సింహాసనం ఎక్కి రాజ్యాన్ని పరిపాలించే అర్హత పొందలేకపోయెను,  మరల  అదే  శ్రీ మహావిష్ణుముర్తి  కలియుగములో యయాతి రెండవ కుమారుడైన తుర్వసు వంశ పరంపరలో నరసనాయకుని ఇంట శ్రీకృష్ణదేవరాయలుగా అవతరించి సింహాసనం ఎక్కి రాజ్యాన్ని పరిపాలించే అర్హత పొందెను ఆనాడు ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా గొల్ల స్త్రీలతో తిరుగుతూ ఉండేననియు, కాని కలియుగములో శ్రీకృష్ణదేవరాయలుగా పర స్త్రీలు అందరిని తోబుట్టువులుగా చూసే వాడనియు, ఆనాడు ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా జరాసందునితో చేసిన యుద్దమున ఓడిపోయి మధుర విడిచి వెళ్ళిపోతే, ఈనాడు కలియుగములో శ్రీకృష్ణదేవరాయలుగా శత్రు దుర్గములను అమిత భలముతో జయిన్చేననియు, ఆనాడు ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా పేరాసతో పారిజాతము స్వాదీనము చేసుకోనేననియు, ఈనాడు కలియుగములో శ్రీకృష్ణదేవరాయలుగా దానిని ఔదార్యముతో అడిగి తెచ్చుకొనెను అని ద్వాపరయుగములోని  శ్రీకృష్ణుని వర్ణనలతో శ్రిక్రిష్ణదేవరయలను కలియుగములోని శ్రీ మహావిష్ణుముర్తి అవతారంగా పోలుస్తూ అద్భుతమైన వర్ణనలతో పారిజాతాపహరణము రచించెను)

చక్రవర్తి మహా ప్రశస్తి నాఁడును నేఁడు - చెలఁగి ధర్మ క్రమ స్థితి ఘటించె
భూభృదుద్ధరణ విస్ఫూర్తి నాఁడును నేఁడు - గో రక్షణ ఖ్యాతిఁ గుదురు పఱిచె
సాధు బృందావన సరణి నాఁడును నేఁడు - వంశానురాగంబు వదలఁ డయ్యె
సత్యభామా భోగసక్తి నాఁడును నేఁడు - నాకల్ప మవని నింపార నిలిపె
నాఁడు నేఁడును యాదవాన్వయమునందు
జనన మందెను వసుదేవ మనుజవిభుని
కృష్ణుఁ డను పేర నరసేంద్రు కృష్ణదేవ
రాయఁ డనుపేర నాదినారాయణుఁడు.

         చక్రవర్తి యను గొప్ప ప్రసిద్ధి కలిగి యుండి ధర్మక్రమ స్థితిని ఘటించుట చేసియు, భూబృదుద్దరణ మొనర్చి గో రక్షణ ఖ్యాతి పాదుకోల్పుట చేసియు, సాథు బృంధావన సరణిని మించి వంశాను రాగము వదలమిం చేసియు త్యభామా భోగాసక్తిని మీరి ఆ కల్ప మవని నుల్పుట చేసియు,ఆ ఆదినారాయణుడె ద్వాపరయుగములో యదు వంశములోని వాసుదేవ సుతుడైన కృష్ణుడు కలియుగమున ఆ యదువు తమ్ముడైన తుర్వసు వంశములోని నరసరాజునకు కొడుకై కృష్ణరాయడు అను పేరుతో పుట్టెనని భావము  

      కృష్ణావతరమున చక్రమును దరించి ధర్మరాజునకు న్యాయమును కలిగించెను. కృష్ణరాయ అవతారమున చక్రవర్తి అని ప్రఖ్యాతి కెక్కి ధర్మమును కాపాడెను.  

చక్రవర్తిత్వము ధర్మక్రమ స్థితి ఈ రెండు అవతారాలలోను సమాన ధర్మాలు.

       క్రిష్ణవతారమున గోవర్ధనగిరిని ఎత్తి గోవులను గోపాలకులను కాపాడెను.  కృష్ణరాయ అవతారమున భూ పాలకులను జయించి భూమిని బాగా పాలించెను.

భూబృదుద్దరణ గో రక్షణ  ఈ రెండు అవతారాలలోను సమాన ధర్మాలు.

        క్రిష్ణవతారమున బృంధావన మునందు వేణువు నందును  గోప స్త్రీల అనురాగాముతోను కులుకుచుండెను.   కృష్ణరాయ అవతారమున దానిని మించిన అనురాగాముతోను  తన కుటుంబీకుల యందును తన వంశీయుల యందును అధిక ఆదరణ కలిగి ఉండెను.(ఎవరు ఈ బంధువులు ఆ కాలం లో ఏ కులానికి అధిక గౌరవం దక్కింది?)

సాదు బృంధావన వంశాను రాగములు ఈ రెండు అవతారాలలోను సమాన ధర్మాలు.

          క్రిష్ణవతారమున సత్యభామా ప్రీతి చేత పారిజాతమును స్వర్గమునుండి తెచ్చెను. కృష్ణరాయ అవతారమున సత్యమునందును సొంత భార్యలు యందును ప్రేమచే నవని నాకల్పము నిలిపెను. సత్యభామా భోగసక్తి యు నవని నాకల్ప స్థాపనము  ఈ రెండు అవతారాలలోను సమాన ధర్మాలు.

           అందువలన ఆ ఆదినారాయణుడె ద్వాపరయుగములో యదు వంశములోని వాసుదేవ సుతుడైన కృష్ణుడు కలియుగమున ఆ యదువు తమ్ముడైన తుర్వసు వంశములోని నరసరాజునకు కొడుకై కృష్ణరాయడు అను పేరుతో పుట్టెనని చమత్కారములతొ  ముక్కు తిమ్మన పారిజాతాపహరణము నందు వర్ణించెను.   


----------------------------------------


     అల్లసాని పెద్దన తను వ్రాసిన మనుచరిత్రమున శ్రీకృష్ణదేవరాయలు వంశం గురించి తెలుపుతూ చంద్ర వంశములోని యయాతి కొడుకైన యదువుకు తమ్ముడైన తుర్వసుని వంశములోని వాడని చాలా స్పస్టముగా తెలిపియున్నారు. 

     అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు తన వంశం గురించి తన స్వహస్తాలతో రచించిన ఆముక్తమాల్యద అను కావ్యమున చంద్ర వంశములోని యయాతి కొడుకైన యదువుకు తమ్ముడైన తుర్వసుని వంశములోని వాడినని చాలా స్పస్టముగా తెలిపియున్నారు 

-----------------------------------------------

        మన హిందూ పురాణాలు ప్రకారం చంద్రవంశమున బుధుడు, యీతనికి పురూరవుడు, యీతనికి ఆయువు, యీతనికి నహుషుడు, యీతనికి యయాతి పరంపరగా పుట్టెను. ఈ యయాతి కృతయుగమువాడు. ఆతనికి యదు, తుర్వసుడు, అను, ద్రుహ్యు, పురు అని ఐదుగురు కుమారులు. వీరిలో యదువుకు పుట్టినవారు మాత్రమె యదు వంశీయులు. ఈ యదువంశములోనే శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగములో పుట్టెను. కలియుగములో హైహయ, కలచుర్య, హొయసల, రాష్ట్రకూట, విజయనగర సంగమ, సాళువ మొదలగు వంశాలవారు ఈ యదువంశ పరంపరలోని వారుగా  ప్రకటించుకున్నారు.

         యదువు తమ్ముడగు తుర్వసుని వంశ పరంపరలోని వారమని గంగవాడి, కళింగ గంగ వంశీయులు, విజయనగర పాలకులైన శ్రీకృష్ణదేవరాయల కుటుంబీకులు ప్రకటించుకున్నారు. ఇంకా  తుర్వసుని వంశ పరంపరలోని వారే దక్షిణాదికి వచ్చి పాండ్య, చోళ, కేరళ, కుళ్య రాజ్యాలను స్తాపించెనని పురాణాల కథనం. మరియు యవనులు అను వారు కూడా తుర్వసుని వంశ పరంపరలోని వారని పురాణాల కథనం.

       యదువు తమ్ముడగు "అను" వంశ పరంపరలోని వారే అంగ, వంగ, కళింగ, పుండ్ర, ఓడ్ర, ఆంధ్ర మొదలగు వారని పురాణాల కథనం.      

    యదువు తమ్ముడగు ద్రుహ్యు వంశ పరంపరలోని వారే కంబోజ, మ్లేచ్చులు మొదలగు వారని పురాణాల కథనం.      
     
     యదువు తమ్ముడగు పురు వంశ పరంపరలోని అర్జనుని వంశం వారే భారత ఖండానికీ సర్వచక్రవర్తులు గ కలియుగములో వర్దిల్లినారు. వారి వంశ పరంపరలోని వారమని చాళుక్య, విజయనగర పాలకులైన అరవీటి మొదలగు వంశాలవారు ప్రకటించుకున్నారు).  

       కృతయుగములో తరువాత ద్వాపరయుగములో ఆ తరువాత కలియుగములో ఈ యయాతి వంశీయులు అనేక అనేక వంశ అనువంశ పరంపరలుగా విడిపోతూ అనేక  వర్గాలుగా విడిపోయి భరతఖండమంతా విస్తరించినారు. వీరందరూ ఉమ్మడిగా చంద్రవంశీయులు. 

                                                                విశ్లేషణ :   పోలిశెట్టి సత్తిరాయుడు, హైదరాబాదు.