11, జులై 2015, శనివారం

వెలివేయబడిన బ్రహ్మనాయుడి బంధువులే వెలమలు (నాయకురాలు నాగమ్మ-7)



        నాకు లభించిన అనేక ఆధారాలను బట్టి బ్రహ్మనాయుడి బంధువులే వెలమ కులస్తులని స్పష్టం చేస్తున్నాను. నేను స్పష్టం చేస్తున్న ఈ విషయం ఎవరినో కించపరచాలనో, నొప్పించాలనో చేస్తున్నది కాదు. చరిత్ర అనేక విధాలుగా వక్రీకరించబడింది. ఏ కులానికి సంబంధించి ఆ కులం ప్రత్యేకతలు చరిత్రలో ఎన్నో వున్నాయి. చరిత్రగతిని అర్థం చేసుకోవడం లో జరిగిన పొరపాట్లు, లేని చరిత్రను తమకు ఆపాదించుకున్న కొందరు రచయితలు అసలు చరిత్రను బయటకు రాకుండా చేశారని నా అభిప్రాయము. రెండువేల సంవత్సరాలకు పూర్వం నాలుగు వర్ణాలుగా, 27 కులాలుగా వున్న కులాలు 19 వ శతాబ్దం ఆరంభం నాటికి 66 అంతకంటె ఎక్కువ కులాలుగా విభజన చెందాయి. ప్రధాన కులం లో నుండి విభజింపబడ్డ కొంతమంది తరువాత కాలంలో ప్రత్యేక కులాలుగా ఏర్పడ్డ సందర్భాలు అనేకం. కొన్ని కులాలు వృత్తులాలో సహాయకారులుగా వుంటూ తరువాత ప్రత్యేక కులాలుగా విడిపోయిన సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి. 

     అలా బలిజ లేదా కాపు కులం నుండి విడిపోయిన వారే వెలమ, కమ్మ కులాలు. వీరిలో వెలమలు పలనాటి చరిత్ర కాలం లో విడిపోగా, కమ్మ కులస్తులు కాకతీయ ప్రతపరుద్రుని కాలంలో విడిపోయినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. 

     నేటికీ ప్రకాశం జిల్లా లోని దోర్నాల మండలం లో వున్న బొమ్మలాపురం ప్రాంతం లో వెలమ కులస్తులు వున్నారు వీరిని ఈ ప్రాంతం లో పెద్ద కమ్మ వారని అంటారు. దీన్ని బట్టి వెలమలు కమ్మల కంటె ముందుగా విడిపోయిన వారని అర్థమవుతోంది. 

 పద్మనాయక చరిత్ర లోని ఈ క్రింది పద్యాలను ఒకసారి గమనించండి.

ఊరివరదనీరు నురికి సరస్సుజేరి
తీర్థయోగమైన తెరగుగాదె
కాలచోదితమున గాకతీశ్వరుల గొల్చి
కాపులెల్ల వెలమ కమ్మలైరి.

తొలికాలముర్వి గొడవల 
వెలియై యాలయములందు విహరించుటచే
నిలకాపు జనులు కొందరు 
వెలమలన్ జగతిలోన విశ్రుతులగుటన్ 

ఈ పద్యాలు కాపు కులం నుండి పై రెండు కులాలు విడిపోయినట్లుగా స్పష్టం చేస్తున్నాయి. 

    కమ్మ కులం గురించి మరో సందర్భం లో చర్చిద్దాం. ప్రస్తుతానికి పలనాటి యుద్ధ కాలం లో వున్నాం కాబట్టి సందర్భానుసారంగా వెలమ కులం ముందు నాటి పరిస్థితులు ఏంటో దాని పూర్వాపరాల గురించి విశ్లేషిద్దాం.

రెండవ పద్యం లో "తొలికాలముర్వి గొడవల" అంటె మొదట్లో జరిగిన భూతగాదాల వల్ల.

    వెలియై యాలయములందు విహరించుటచే అంటే వెలివేయబడి ఆలయాలందు తలదాచుకున్నారు. వారే తరువాతి కాలం లో వెలమలుగా పిలువబడ్డారు. ఒక కులాన్నే వెలివేయడం సాధ్య మౌతుందా??? సాధ్యం కాదు. 

    కానీ పెద్ద ఎత్తున వెలివేయబడ్డారు. బహుశా అవి కొన్ని కుటుంబాలై వుంటాయి. అలాంటి పరిస్థితులు ఎప్పుడు ఏర్పడ్డాయి. 

    కమ్మలకంటే ముందుగానే వెలమలు వెలివేయబడి మరో కులంగా స్థిరపడ్డారు. అంటే కాకతీయుల కాలం కంటే ముందై వుండాలి. 

     వెలమ కులం లో ప్రసిద్ధి గాంచిన వారు వెలుగోటి రాజులు. వీరి గోత్రం "రేచెర్ల"  వీరు 11,12 శతాబ్దాలలో నేటి కర్నూలు జిల్లా "వెలుగోడు" లో స్థిరపడినట్లు కనిపిస్తొంది. ఆ కాలం నాటికి ఈ ప్రాంతం లో అనేక గ్రామాలు ఉన్నాయి. వీరు నివసించిన వెలుగోడు మొదట్లో వెలివాడ, వెలుగువాడ, వెలుగోడుగా రూపాంతరం చెదినట్లు తెలుస్తోంది. వీరు ఇక్కడ మట్టికోట కట్టుకుని విజయనగర రాజులకు సామంతులుగా రాజ్యమేలారు. నేటికీ విరు నిర్మిచిన చెన్నకేశవస్వామి దేవాలయం నాటి రాజులు వాడిన చలువబండ వెలుగోడులో వున్నాయి. ఆ తరువాత ముస్లిం పాలకుల దాడులలో వెలుగోడు మట్టి కోట ధ్వంసం కాగా వెంకటగిరి చేరినట్లు తెలుస్తోంది.

ఇక కథలోకి వద్దాం.....

      ప్రాచీన భారత దేశం లో శెట్టి సమయాలు అనే ఒక బృహత్తరమైన వ్యవస్థ వుండేది. వీరే అటు వ్యాపారాలను ఇటు గ్రామ, పట్టణ, నగర పాలనలను నిర్వహించారు. వీరినే దేశాయి రెడ్లు, దేశాయి శెట్లు అని పిలిచేవారు. ఈ దేశాయిలు, శెట్లు నాటి గ్రామాలలో పన్నులు వసూలు చేయడం, తీర్పులు చెప్పడం చేసేవారు. కులాల కట్టుబాట్లను నియంత్రించేది కూడా వీరే. నాటి ప్రజల లో కుడి, ఎడమ చేతులకు చెందిన కులాలు వుండేవి. వాటిలో కుడిచేతి కులాలే మొదటి నుండి ఆధిపత్యం చెలాయించాయి. ఈ కులాలకు చెందిన వారే నాటి రాజులు, చక్రవర్తులు. ఈ కుడి చేతి కులాలకు పెద్దలు బలిజ కులస్తులు.  

      నాగమ్మ తండ్రి రామిరెడ్డి జిట్టగామాల పాడులో తీర్పులు చెప్పడం లో దిట్ట అని పేరుప్రఖ్యాతులు గాంచాడు. అంటే ఆయన ఆ ప్రాంత దేశాయి రెడ్డి. దీన్ని బట్టి నాగమ్మ సామాన్య కుటుంబానికి చెందినది కాదు ఉన్నత కుటుంబానికి చెందినది అని తెలుస్తోంది. 

     భారత దేశాన్ని, ఇక్కడి సంపదను శాసించిన వారు వ్యాపారులు. పలనాటి చరిత్ర నాటికే పెద్ద ఎత్తున సముద్ర వ్యాపారాలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రతి రాజ్యం లో ప్రధాన ఆదాయ మార్గాలుగా వర్తక వాణిజ్యాలు వున్నాయి. ఈ వర్తక వాణిజ్యాలను శాసించిన వ్యాపారులు ఎవరు? 

    చరిత్రలో వర్తక వాణిజ్యాలను శాసించిన సమయాలు ప్రధానంగా వీరబలింజ సమయాలు. వీరిలో అయ్యావళీ-500, ముమ్మూరి దండులు-36 అనేవి శాసనాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. వీరంతా వర్తకులే కాదు గొప్ప యుద్ధ వీరులు కూడా. ఈ ముమ్మూరి దండులు వర్తక బిడారులను దొంగల నుండి రక్షించే రక్షకులు. 

ఇదీ నాటి నేపథ్యం...

     ఇలాంటి పరిస్థితులలో వర్తకులపై పెద్ద ఎత్తున దొంగల దాడులు జరుగుతుండేవి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత నాటి వీరబలింజలది. ఈ క్రమం లోనే వ్యాపారులు రాజుకు ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసి వుంటారు.  కానీ రాజు మంత్రి బ్రహ్మనాయుడికి బాధ్యతలు అప్పగించి వుంటాడు. ఆ దోపిడీ దారులంతా బ్రహ్మనాయుడి బంధువులు, స్నేహితులు కావడం తో వారిపై ఎలాంటి చర్యలూ తీసుకుని వుండరు. 

    విరబలింజ సమయాలకు ఒక అలవాటు వుంది. ఏ రాజైనా తమకు అనుకూలంగా చర్యలు తీసుకోక పోతే ఆ రాజ్యాలను సైతం ఆక్రమించుకుంటారు. తమ వారిని పాలకులుగా నియమిస్తారు. కానీ ఇక్కడ పాలకులు దొంగలూ అందరూ తమవారే ఏం చేయాలి? 

అందుకే జిట్టగామాలపాడు లో తండ్రి తరువాత ఆ బాధ్యతలను నిర్వహిస్తున్న నాగమ్మను ఆశ్రయించారు. 

అలా నాగమ్మ అనుగురాజు తనకు ఇచ్చిన వరాన్ని ఉపయోగించుకుని బ్రహ్మనాయుడి భరతం పట్టింది. 

వాస్తవానికి నాగమ్మ ఒక్కతి కాదు ఆమె వెనుక ఉన్న సమయాలు ఆమెకు అండగా నిలిచాయి. 

      ఇక్కడ ఒక్క దొంగతనాలు మాత్రమే బ్రహ్మనాయుడిని మంత్రి పదవికి దూరం చేయలేదు. అది ఒక కారణం మాత్రమే. ప్రధానమైనది ఆయన ప్రతిపాదించిన చాపకూటి సిద్ధాంతం. ఈ చాపకూటి సిద్ధాంతం సహపంక్తి భోజనాలని చాలామంది రచయితలు అభిప్రాయపడ్డారు. కానీ అది తప్పు. చాపకూటి సిద్ధాంతం అనేది ఒక "ఎంగిలిమగళం" అని తెలుస్తోంది. ఒక చాపను పరచి అందులో  భోజనాన్ని కలిపుతారు. అక్కడ ఒకరు తిన్న తరువాత అదే చోట మరొకరు తింటారు. ఇక్కడ కులం లేదు కట్టుబాట్లు ఉండవు. ఇది చూసి చాలా మంది బ్రహ్మనాయుడిని గొప్ప సంఘ సంస్కర్తగా అభివర్ణిస్తారు. కానీ ఈ చాపకూడు వెనుక పచ్చి వ్యభిచారం జరిగేదని భార్యా భర్తల మధ్య ఉండే కట్టుబాట్లకు తిలోదకాలిచ్చేశారని తెలుస్తోంది. కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమై పోయింది. దీనికి అనుగుణంగానే మాచెర్ల, మార్కాపురం లలో ఉన్న చెన్నకేశవస్వామి దేవాలయ గాలి గోపురాలపై విపరీతమైన బూతు బొమ్మలను చెక్కించారని అంటారు. 

     కులసంకరాన్ని అతి పెద్ద నేరంగా భావించే పూర్వాచార కులాలకు బ్రహ్మనాయుడు పెద్ద సవాలుగా మారాడు. దీనిని పలువురు నాటి పెద్దలు నలగామరాజు దృష్టికి తీసుకు వచ్చి వుంటారు కానీ బ్రహ్మనాయుడికి ఎదురు చెప్పలేని అశక్తత నలగాముడు వెలిబుచ్చి వుంటాడు. దీనిని అడ్డగించలేని నలగాముడు నాగమ్మకు పరోక్షంగా సహకరించి వుండవచ్చు. చాపకూడును అడ్డగించలేక పోయినా, బ్రహ్మనాయుడిని నిలువరించడానికి దొగతనం నేరాలు అవకాశంగా చిక్కాయి. ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సాక్ష్యాలతో సహా పట్టుబడడం తో బ్రహ్మనాయుడు తప్పించుకోలేని పరిస్తితులు ఏర్పడ్డాయి. 


    అలా దొరికిన బ్రహ్మనాయుడిని మొదట దేశబహిష్కారం శిక్షగా వేసి వుంటారు.  యుద్ధం లో ఓడిపోయిన తరువాత అయన వర్గీయుల పై కుల బహిష్కరణ వేటు వేసి వుండవచ్చు.

ఇంకా  ఉంది తరువాత టపాలో ...