7, డిసెంబర్ 2014, ఆదివారం

మూడు గంటల మంత్రి పదవి...(నాయకురాలు నాగమ్మ-6)



        గురజాల రాజ్యం లో విపరీతంగా దొంగతనాలు ప్రబలి పోయాయి. ప్రజలు, వ్యాపారులు రాజుగారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. 

     గ్రామాలలోని సమయ పాలకులందరూ నాగమ్మ వద్దకు వెల్లి తమ గోడు చెప్పుకున్నారు. (బ్రహ్మనాయుడి ఆగడాలను అడ్డుకోలేక పోతున్నామని నలగామ రాజు తమ్ముడు నరసింగరాజు నాగమ్మను పాలనలో జోక్యం చేసుకోవాలంటూ ప్రాధేయ పడినట్లు కొందరు రచయితలు రాశారు) అది నిజం అయి వుండక పోవచ్చు. ఎందుకంటే రాజకీయాలలో వుండేవారు సామాన్యులు ఎంత మేధావులైనా వారిని చిన్న చూపే చూస్తారు కాబట్టి నాగమ్మను నరసింగరాజు ప్రాధేయ పడడం కల్పన అయి వుండవచ్చు. ప్రజల వ్యాపారుల విన్నపాలే నిజమయి వుంటాయి.
          ఈ నేపథ్యం లో ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన పరిస్థితులు నాగమ్మ ముందు ఏర్పడ్డాయి. 

      సుదీర్ఘంగా ఆలోచించిన నాగమ్మ అనుగురాజు గతంలో తనకు చేసిన వాగ్దానాన్ని వినియోగించుకోవాలని  నిర్ణయించుకుంది. ఏడు ఘఢియల సమయం నాగమ్మకు ఆమెకోరిన సమయంలో తన వారసులెవరు వున్నా మంత్రి పదవి ఇవ్వాలని రాసి ఇచ్చిన వాగ్దాన పత్రం తీసుకుని రాజ సభకు చేరుకుంది నాగమ్మ. 

       అప్పుడు బ్రహ్మనాయుడు గురజాలలో లేడు. అది యాధృచ్చికమో లేక నాగమ్మ అదే సమయాన్ని ఎంచుకుందో తెలియదు కానీ ఆమెకు రాజు ఏడు ఘడియల పాటు మంత్రి పదవి ఇచ్చాడు. 

       ఏడు ఘఢియలంటే నేటి మన కాలమానం ప్రకారం రమారమి మూడు గంటల కాలం మాత్రమే. ఆ కొద్ది సమయం లో అమె మంత్రికి వుండే అన్ని అధికారాలను వినియోగించుకుంది. 
    
     దండనాయకులను తీసుకుని బ్రహ్మనాయుడి అనుచరుల ఇళ్ళపై దాడులు చేశి సోదాలు చేసింది. ధనం, వస్తుసంపద, స్వాధీనం చేసుకుని రాజుగారి ఎదుటికీ తీసుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో దోషులు సాక్ష్యాధారాలతో సహా పట్టుబడ్డారు.

        వారికి నాలుగు తగిలించేసరికి వాస్తవాలు బయటపెట్టారు. ఈ అరాచకాల వెనుక బ్రహ్మనాయుడు వున్నాడన్న వాస్తవం బయట పడే సరికి గ్రామాల పాలకులకు ఏం సమాధాన చెప్పాలో రాజుకు అర్థం కాలేదు. 

      ఈ లోపు పొరుగూరు వెళ్ళిన బ్రహ్మనాయుడు తిరిగొచ్చాడు. సభలో విచారణ జరిగింది. సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ బ్రహ్మనాయకుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. బ్రహ్మనాయుడు ఏమీ మాట్లాడ లేక పోయాడు. ఏం చేయమంటారు బ్రహ్మన్నగారూ  అని రాజుగారు అడిగారు.

        మీ ఇష్టం ప్రభూ.... అన్నాడు బ్రహ్మన్న.

      రాజ్యంలో ప్రజలను కాపాడాల్సిన స్థాయిలో వుండి ప్రజా సంపదను దోచుకోవడానికి కారకుడైన బ్రహ్మన్నను కఠినంగా శిక్షించాలని సభికులు కోరారు. 

      దోషి స్థానంలో వున్న బ్రహ్మన్న మాట్లాడలేదు.

        అనుగు రాజు మరణం తరువాత గురజాల రాజ్యానికి బ్రహ్మనాయుడు చేసిన సేవలను పరిగణలోకి తీసుకున్న సభ బ్రహ్మనాయుడిపై బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయింది. 

     నాటి ఆచారాల ప్రకారం బ్రహ్మనాయుడి కుటుంబాన్ని, ఆయన అనుచరుల కుటుంబాలను కులం నుండి బహిష్కరించారు. నాటి శెట్టి సమయాల ఆచారం ప్రకారం వెలివేయబడిన కుటుంబాలకు ఎవరూ సేవలందించ కూడదు. చాకలి బట్టలు వుతకడు, మంగలి క్షవరం చేయడు, కుమ్మరి కుండలు ఇవ్వడు. బేదరి స్మశానంలో శవాన్ని సైతం తగులబెట్టడు. వెలివేయబడిన వారి జీవితం చాలా దుర్భరంగా వుండేది. 

        రాజ్యాన్ని సంక్షోభంలోనుండి గట్టెక్కించిన నాగమ్మను శాస్విత మంత్రిగా వుండిపోవాల్సిందిగా రాజుతో సహా, గ్రామ సమయాల పాలకులు సైతం కోరడంతో నాగమ్మ చరిత్రలో తొలి మహిళా మంత్రిణిగా బాధ్యతలు చేపట్టింది. ఇలా రెడ్డిగారి నాగమ్మ నాయకురాలు నాగమ్మ అయింది.  

                 నేటి "వెలమకులం" బ్రహ్మనాయుడితోనే ప్రారంభమైందా....తరువాత టపాలో చూడండి  

4, డిసెంబర్ 2014, గురువారం

పలనాటిలో పెచ్చుమీరిన అరాచకం....(నాయకురాలు నాగమ్మ-5)



          అనుగు రాజు మరణం తరువాత చిన్నరాణి మైలమాదేవి ఒక్కగానొక్క కుమారుడు రాజపుత్రులందరిలోకి పెద్దవాడు 13 సంవత్సరాల నలగామరాజు సింహాసనమధిష్టించాడు. నలగాముడు చిన్నపిల్లవాడు కావడంతో మంత్రి బ్రహ్మనాయుడే అధికారాన్ని చలాయించాడు. 

    స్వతహాగా బ్రహ్మనాయుడు వ్యభిచారని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. బ్రహ్మనాయుడు ప్రదిపాదించిన, ఆయనకు చరిత్రలో సంస్కరణవాది అని పేరు తెచ్చిపెట్టిన చాపకూటి సిద్ధాంతం గురించి చాలమంది రచయితలు గొప్పగా వర్ణించారు. "చాపకూటి సిద్ధాంతం" అంటే "సహపంక్తి భోజనాలు" అని కులమతాలకు అతీతంగా దాన్ని బ్రహ్మనాయుడు ప్రతిపాదించాడని చాలమంది నేటికీ అపోహ పడుతుంటారు కానీ అది తప్పు .

     నిజానికి చాపకూటి సిద్ధంతం అంటే ఒక చాపను పరిచేవారు ఆ చాపపై అన్నం, కూరలు వంటి ఆహార పదార్తాలను వడ్డించేవారు. ఒకవ్యక్తి ఆ చాపపై అన్నం కలుపుకుని తిని వెళ్ళిన తరువాత అదే ప్రదేశంలో తరువాత వచ్చిన వారు అన్నం కలుపుకుని భుజించాలి. ఇది చాలా అనాగరిక వ్యవహారం కావడంతో నాటి వ్యవస్థలో బ్రహ్మనాయుడిపై వ్యతిరేకత వచ్చిందంటారు. ఈ చాపకూటి సిద్ధాంతం వెనుక బ్రహ్మనాయుడి అనుచరుల అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరిపోవడంతో ప్రజలలో బ్రహ్మనాయుడి పట్ల అసంతృప్తి జ్వాలలు రగిలాయంటారు. 

       బ్రహ్మనాయుడి కౄర స్వభావానికి భయపడ్డవారు ఆయన వ్యవహారాలను ప్రశ్నించలేక పోయారు. చివరికి రాజు నలగాముడు సైతం బ్రహ్మనాయుడిని అడ్డగించలేక పోయాడని అంటారు. అందుకే ఎన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ నలగాముడు మిన్నకుండిపోయాడే కానీ బ్రహ్మనాయుడిని అదుపుచేయలేక పోయాడు. దీంతో బ్రహ్మనాయుడి అనుచరగణం ఆడింది ఆట పాడింది పాట అన్న చందంగా సాగింది. అనుచరులలో కొందరు బ్రహ్మనాయుడి అండ చూసుకుని వ్యాపారులను దోచుకోవడం, దొంగతనాలు చేయడంతో ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ  పరిస్థితులలో కొట్టుమిట్టాడారు. 

         ఇక్కడ చరిత్రకారులు మరచిపోయిన కొన్ని వ్యవస్థల గురించి చెప్పుకోవాలి. నాటి కాలంలో భారతదేశం నుండి పెద్ద ఎత్తున వ్యాపారాలు జరిగేవి. ఈ వ్యాపారస్తులకు సంబంధించి ట్రేడ్ యూనియన్ లు వుండేవి. వాటిని శెట్టిసమయాలు, వణిజసమయాలు అని పిలిచేవారు. ఈ సమయాలకు ఎక్కువగా నాటి పాలకుల బంధువులే నాయకులుగా వ్యవహరించేవారు. ఈ సమయాలు (యూనియన్లు) కొన్నికులాల సముదాయాలు.

           ఈ సమయాలకే గ్రామాలలో అధికారాలు వుండేవి. గ్రామాధికారులను శెట్టి, దేశాయి, రెడ్డి అని పిలిచేవారు. ఈ సమయ పాలకులు పన్నులు వసూలు చేయడం, తీర్పులు చెప్పడం వంటి అధికారాలను కలిగి వుండేవారు. యుద్ధాల వలన రాజులు మారినా ఈ సమయాలు  మాత్రం యధావిధిగా పనిచేసేవి. రాజులు కూడా ఈ సమయాల సలహా సంప్రదింపులతోనే రాజ్యపాలన కొనసాగించేవారు. ఇప్పటివరకు దొరికిన ఆధారాల వలన ఈ సమయాలు క్రీ.శ.1వ శతాబ్దం వాడైన కరికాళచోళుని కాలంలో ప్రారంభమైనట్టుగా ఆధారాలు లభిస్తున్నాయి. భారతదేశం ప్రపంచదేశాలలో అత్యున్నత నాగరికతను అనుభవించడానికి ఈ సమయాలే కారణం. 

        ఇక్కడ కులం గురించి అసందర్భమైనా ఒక చిన్న విషయం చెప్పుకోవాల్సిన అవసరం వుంది. ప్రాచీన భారతీయులు చాలా మేధావులు వారికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే జన్యుపరంగా సంక్రమించే నైపుణ్యం గురించిన అవగాహన వుంది. 

        నేడు చాలామంది కుహనా మేధావులు భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి చాలా కులాలు వుండడమే కారణం అంటారు. కొందరైతే కులం గోడలు బ్రద్దలు కొడదాం రండి అంటూ పిలుపునిస్తుంటారు. 

     పాశ్చాత్య ప్రపంచంలో "మెండెల్" ప్రకటించిన తరువాతనే జాతులు వంశపారంపర్య లక్షణాలను కలిగి వుంటాయని తెలిసింది. 

      ఈ సంగతి ప్రాచీన భారతీయులకు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే తెలుసు. అందుకే కులాలను ఏర్పరిచారు. ఈ కులాలు వృత్తుల వారీగానే ఏర్పడ్డాయి. ఎందుకంటే ఒకతరం సంపాదించుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకున్న తరువాతి తరం దాన్ని మరింత మెరుగుపరచి ముందుతరానికి అప్పగించేది. అలాంటప్పుడు ఒక రకమైన సాంకేతికతను ఆ కులం వారే కొనసాగించేవారు. తరతరాలుగా ఆ రంగాలలో నైపుణ్యం సంపాదించేవారు. కుల సంకరం జరిగితే నైపుణ్యాన్ని కోల్పోయే ప్రమాదం వుందన్న విషయం ప్రాచీన భారతీయులకు బాగా తెలుసు. 

         నేడు మనం జన్యు స్వచ్చత గురించి మాట్లాడుతుంటాము. సంకరజాతి వంగడాలకు జన్యు స్వచ్చత వుండదు. మన పూర్వీకులు మనుషులాలో కూడా జన్యు స్వచ్చతను కాపాడేందుకే కులాల ఏర్పాటును చేశారు. అలా తరతరాలుగా సాంకేతికత జన్యు రూపంలో సంక్రమిస్తూ వస్తోంది. కానీ నేడు పంచామృతం లాంటి మన గొప్పదనానికి కల్తీ కల్లు వంటి పాశ్చాత్య సంస్కృతి కి వున్న తేడాను తెలుసుకోలేక పోతున్నాము.

ఇక కథలోకి వద్దాం ...

       అలా కొన్ని వృత్తులకు సంబంధించిన కులాలు తమ ఉత్పత్తులను తామే అమ్ముకునే వెసులుబాటు ఆ కాలంలో వుండేది. ఈ కులాలన్నిటికీ "మహానాడు"లు  అనే వేదికలపైన కట్టుబాట్లు, హద్దులు నిర్ణయించేవారు. అవే నాటి శాసనాలు. 56 దేశాలుగా(చప్పన్న దేశాలు) పిలువబడిన అఖండ భారతదేశం మొత్తం ఈ మహానాడులలో జరిగే శాసనాలకు ప్రజలు కట్టుబడి జీవించేవారు. ఇక మన కథలో...

       జిట్టగామాల పాడు గ్రామ పెద్దలు నాగమ్మ కుటుంబీకులు. నాగమ్మ తండ్రి తీర్పులు చెప్పడంలో దిట్ట అని మనం చదువుకున్నము కదా. అంటే ఆ పరగణాలో నాగమ్మ కుటుంబం ఖచ్చితంగా సమయ పాలకులు అయివుండాలి. 

           సాధారణంగా మనకు ఒక వ్యక్తి అన్యాయం చేస్తే ఆ వ్యక్తికి గిట్టని వ్యక్తికి చెప్పుకోవడం జరుగుతుంది. కౌటిల్యుని అర్థ శాస్త్రం ప్రకారం శత్రువు శత్రువు మిత్రుడవుతాడు. 

       అదే విధంగా ఇక్కడ బ్రహ్మనాయుడు అతని అనుచరులు చేస్తున్న ఆగడాల గురించి దోపిడీకి గురైన సమయాల వ్యాపారులు ఫిర్యాదులు చేశారు. రాజు కూడా పట్టించుకోవడంలేదని వాపోయారు. అమ్మా నాగమ్మా నువ్వే ఎలాగయినా మమ్మల్ని, మా వ్యాపారాలను కాపాడాలని వేడుకున్నారు. అప్పటికే బ్రహ్మనాయుడు చాపకూటి సిద్ధాంతం చాటున చేస్తున్న దురాగతాలు ఆమె చెవిని చేరాయి. 

ఇక్కడ మరో చిన్న వివరణ ఇవాల్సి వస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి. 

          కులాలన్నీ ఒక్క మాటపైన ఉన్న సమయాల గురించి మనం తెలుసుకున్నాము. నిజానికి నాటి ప్రజలంతా ఒక్కమాటపైనే వుండేవారా... ఈ రచయిత చెబుతున్నది ఎంతవరకు నమ్మవచ్చు...నిజమే ఆ కాలంలో కులాల వారీగా వున్న సమూహాలు అన్నీ ఎప్పుడూ ఒకటిగా లేవు. పూర్వాచార, వామాచార కులాలుగా ఏర్పడ్డాయి. వీరిని కుడి, ఎడమ చేతుల కులాలు అనికూడా అంటారు. 

      పూర్వాచార కులాలు అంటే ప్రాచీన ఆచారాలు, కట్టుబాట్లు క్రమశిక్షణాయుతమైన జీవితానికి కట్టుబడి జీవించేవారు. వామాచార కులాలు ఎప్పుడు వీరికి వ్యతిరేకమే వీరు స్వతహాగా ఆధునిక భావాలు కలవారు. ఈ రెండు వర్గాలలో పూర్వాచార కులాలు మెజారిటీ కులాలు కావడం తో వామాచార కులాలపై ఎప్పుడూ పైచేయిగానే వుండేవారు. 

       పూర్వాచార కులాలు కులసంకరానికి పూర్తిగా వ్యతిరేకం అయితే వామచారకులాలు కులసంకరాన్ని పెద్దగా పట్టించుకునే వారు కాదు. విధవా వివాహాలకు పుర్వాచార కులాలు వ్యతిరేకమైతే వామాచార కులాలు అనుకూలంగా వుండేవి. ఇల ఈ రెండు వర్గాలూ ఒకరు ఎడ్డేమంటే మరొకరు తెడ్డెమనేవారు.

          నాటి రాజులు, గ్రామాధికారులూ మెజారిటీ వర్గాలైన పూర్వాచార కులాలకు చెందిన వారే. 

        అందుకే బ్రహ్మనాయుడు చేపట్టిన చాపకూటి సిద్ధాంతం పూర్వాచార కులాల కట్టుబాట్లను బ్రష్టు పట్టించేవిధంగా వుండడంతో ఆ వర్గాలన్నీ ఆగ్రహంతో రగిలి పోయాయి. అందుకే ఆయా వర్గాలు అన్నీ నాగమ్మను ఆశ్రయించి ప్రతిఘటించాల్సిందిగా కోరి వుండవచ్చు. 

         పదవులకు దూరంగా ప్రశాంతంగా ఆశ్రమం నిర్మించుకుని జీవిస్తున్న నాగమ్మ కులాల శ్రేష్టులు అంతా తనను ఆశ్రయించినప్పుడు కాదనలేక ఆలోచనలో పడింది. బ్రష్టు పట్టిన వ్యవస్థను ప్రక్షాలనం చేయడానికి నాగమ్మ రంగంలోకి దిగక తప్పలేదు. 

        నాగమ్మ ఏం చేసింది... ఎలా బ్రహ్మనాయుడి అనుచర సామ్రాజ్యాన్ని ఢీకొట్టింది...బ్రష్టు పడుతున్న వ్యవస్థను ఒక్క అబల ఎలా సరిదిద్దింది నేటి తరం ఊహించను కూడా ఊహించలేని  సాహస మహిళ నాగమ్మ ఎలా సాధించిందో ....
                                                          తరువాత టాపాలో చూద్దాం...

2, డిసెంబర్ 2014, మంగళవారం

నాగమ్మ ఎలా నాయకురాలయింది... (నాయకురాలు నాగమ్మ-4)



నాగమ్మ... నాయకురాలు నాగమ్మ...

      నాగమ్మ ఇంటి పేరు నాయకురాలు కాదు. ఆ కాలంలో నాయకుడు, నాయుడు అనే బిరుదాలు (లేదా పదవులు) రాచరికం లో అంతర్భాగమైన సైనికులకు, సేనానాయకులకు కనిపిస్తాయి. చరిత్రలో చాలామంది పరిశోధకులు నాగమ్మ జన్మస్థలం నేటి కరీం నగర్ జిల్లాలోని ఆరవెల్లి గ్రామమేనని నిర్ధారణకు వచ్చారు. చాలమంది రచయితలు నాగమ్మ చౌదరి రామిరెడ్డికి అనాధగా దొరికిన బిడ్డగా రాశారు. చౌదరి రామిరెడ్డి కి నాగమ్మ అనాధగా దొరికిన బిడ్డనే అయితే నాగమ్మ తన  చివరి రోజుల్లో అదే ఆరవెల్లికి వెళ్ళి వుండేది కాదు. అక్కడే ఆమె చివరి రోజులు గడిపింది అన్న ఆధారాలు కనిపిస్తున్న నేపథ్యంలో అనాధగా దొరికిందన్న కట్టుకథను కొట్టివేయక తప్పదు. 

     దీన్ని బట్టి నాగమ్మ తండ్రి చౌదరి రామిరెడ్డి నాగమ్మను తీసుకుని పలనాటి ప్రాంతంలోని జిట్టగామాలపాడుకు వచ్చి వుండవచ్చు. బహుశా ఆరవెల్లి ప్రాంతంలో కరువు ఏర్పడడమో లేక చౌదరి రామిరెడ్డి ఆర్థికంగా దెబ్బతినడమో, లేక నాగమ్మ తల్లి మరణించి నందు వల్ల ఆ బాధను మరచిపోవడానికి గ్రామాన్ని వదలి బావమరిది మేకపోతుల జగ్గారెడ్డి పంచన చేరి వుండవచ్చు. మేకపోతుల జగ్గారెడ్డి జిట్టగామాలపాడులో బహుశా గ్రామ పెద్ద అయి ఉండవచ్చు. ఎందుకంటే ఈ చౌదరి, రెడ్డి అనే బిరుదులు లేదా పదవులు పెద్ద ఆస్తి పరులకు, గ్రామాధి కారులకు మాత్రమే ఉండేవి. 
     నేడు మనకు కనిపిస్తున్న రెడ్డి కులం, కమ్మ కులానికి చెందిన పదాలు కాదని గమనించాలి. 
   ఎందుకంటే నేడు రెడ్డి, కమ్మ అని పిలువబడే కులాలు నాటికి ఇంకా ఏర్పడలేదు కనుక ఈ పదాలు కులసూచకాలు కాదని మనవి చేస్తున్నాను. ఎందుకంటే కమ్మ కులస్తులు కాకతీయుల కాలంలో కాపు కులం నుండి విడిపోయారని తెలుస్తోంది. కాకతీయులు పలనాటి యుద్ధం తరువాత రాజ్య పాలన చేపట్టారు. ఇక రెడ్డి అనే కులం అప్పుడు లేనే లేదు.

     అలా వలస వచ్చిన రామిరెడ్డి తన ఒక్కగానొక్క కుమార్తెకు క్షత్రియోచిత విద్యలన్నీ నేరిపించాడు. తెలుగు, సంస్కృత భాషలలో నాగమ్మ ప్రవీణురాలని తెలుస్తోంది. బ్రతుకుదెరువు కొరకు వలస వచ్చిన వ్యక్తి ఒక ఆడపిల్లకు ఇలా అన్నివిద్యలూ ఎందుకు నేర్పిస్తాడు? దీన్ని బట్టి చౌదరి రామిరెడ్డి బ్రతుకుదెరువును వెతుక్కుంటూ జిట్టగామాలపాడుకు రాలేదని అర్థమవుతుంది. మేకపోతుల జగ్గరెడ్డి కుమారుడు సింగారెడ్డి కి ఇచ్చి నాగమ్మకు బాల్య వివాహం చేశారు. చాలామంది రచయితలు నాగమ్మ భర్త పేరు తెలియదని రాశారు. కొంతమంది మేనమామ జగ్గరెడ్డినే వివాహం చేసుకుందని రాశారు. ఇందులో వివాదాలెలా వున్నా నాగమ్మకు మాత్రం బాల్యవివాహం జరిగిందన్నది మాత్రం అందరూ ఒప్పుకునే అంశం.
   
     ఈ నేపథ్యం లో జిట్టగామాలపాడులో చెరువు నిర్మాణం కొరకు భూమి సేకరణజరిగింది. అందులో ఏర్పడిన వివాదంలో నాగమ్మ తండ్రి చౌదరి రామిరెడ్డి, మేనమామ జగ్గారెడ్డిలు హత్యకు గురయ్యారు. ఈ వివాదం బ్రహ్మనాయుడికి జగ్గారెడ్డికి జరిగినది కావడంతో హత్య చేయించింది బ్రహ్మనాయుడే అని నిర్ధారణకు వచ్చారు. నాగమ్మ తండ్రి రామిరెడ్ది తీర్పులు చెప్పడంలో దిట్ట అని పేరుండేది. ఈయనను నిద్రిస్తుండగా మంచానికి కట్టివేసి సమీపంలో వున్న అడవిలోకి తీసుకు వెళ్ళి హత్య చేశారు. నిద్రిస్తున్న వాడిని హత్య చేశారు అంటే మెలకువగా వున్నప్పుడు ఆయనను ఏమీ చేయలేని పరిస్థితులు వుండి వుండవచ్చు. దీన్నిబట్టి చౌదరి రామిరెడ్డి మహావీరుడై వుండి వుండాలి, లేదా ఈయనను ఏమైనా చేస్తే ప్రజలు తిరగబడే పరిస్థితులు వుండి వుండాలి. అందుకే ఆయనను మంచానికి కట్టివేసి హత్య చేసి వుంటారు. జగ్గరెడ్డి హత్య గురించి వివరణ దొరకలేదు. 

     కానీ ఈ రెండు హత్యలూ బ్రహ్మనాయుడే చేయించాడనే అరోపణలు మాత్రం పలనాటి చరిత్ర రాసిన రచయితలందరూ ఏకీభవించారు.  

         ఈ విధంగా బ్రహ్మనాయుడి పై నాగమ్మకు వ్యతిరేకత ఏర్పడింది. 

     తండ్రి మేనమామ తరువాత గ్రామాధిపత్యం నాగమ్మనే చేపట్టినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే అనుగురాజు అడవిలో వేటాడి తిరుగు ప్రయాణంలో వుండగా ఆయనకు, ఆయన పరివారానికి చలువ పందిళ్ళు వేసి తృప్తితీరా భోజనం పెట్టింది. ఒక్కసారి ఆనాటి పరిస్థితులను బేరీజు వేద్దాం....

       రాజులకు భోజనం పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆ స్థాయిలో భోజనం పెట్టడం అంటే పెద్ద సంపన్నులయి వుండాల్సిందే. ఎంత సంపన్నులయినా ఎవరు పడితే వారు భోజనం పెడితే రాజులు భుజిస్తారా??? భారత దేశంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కులాల పట్టింపు వుండేది. అంతే కాకుండా సామాజికంగా కూడా ఉన్నత స్థాయిలో ఉండేవారి అహ్వానాలు మాత్రమే రాజులు మన్నించేవారు. దీన్ని బట్టి నాగమ్మ ఖచ్చితంగా ఆ ప్రాంత పాలనకు సంబంధించిన కుటుంబానికి చెందినదే అయివుండాలి. కత్తిసాము, అశ్వారోహణ, గజారోహణ, యుద్ధతంత్రాలు, సంస్కృతాంధ్ర భాషలలో పాండిత్యం. ఇలా సకల కళలు అభ్యసించిందంటే ఈమె సామాన్య కుటుంబంలో పుట్టిందని అభిప్రాయపడడం సమంజసమేనా???? 

        అనుగురాజు ఆనందపడే రీతిలో సత్కరించిందంటే ఏ స్థాయిలో సత్కరించి వుండాలి? ఆమె సత్కారాలకు ఆనంద భరితుడైన అనుగురాజు ఆమె కోరినప్పుడు ఏడు ఘడియల పాటు మంత్రి పదవి ఇస్తానని వరమిచ్చాడు. కాదు రాసి ఇచ్చాడు. వరం నాగమ్మే అడిగిందా లేక అనుగురాజే ప్రతిపాదించాడా? ఒక్క సారి విశ్లేషించి చూద్దాం. 

         భోజనం చేసిన తరువాత నాకు మంత్రి పదవి ఇమ్మని నాగమ్మే అడిగి వుంటుందా... అలా అడిగితే నాగమ్మ చులకన అయివుండేది. ఆమె ఆతిథ్యానికి ముగ్ధుడైన అనుగురాజు నీకేం కావాలో కోరుకో అని వుండవచ్చు. నాగమ్మ ప్రతిభాపాటవాల గురించి అనుచరులు చెప్పి వుండవచ్చు. అంతటి ప్రతిభా పాటవాలు కలిగివుండి ఈ మారుమూల గ్రామంలో ఎందుకున్నావని రాజు ప్రశ్నించి వుండవచ్చు. రాజ్య పాలనలో భాగస్వామివి కమ్మని రాజు ఆహ్వానించి వుండవచ్చు...వాటన్నింటిని నాగమ్మ సున్నితంగా తిరస్కరించి వుండవచ్చు... 

    పైన ఉదహరించిన ఊహలన్నీ నాకు నాగమ్మపై ఉన్న అభిమానాన్ని ప్రదర్శించడానికి తాపత్రయ పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి కదా. 

      నేను ఇలా ఎందుకు ఊహించడానికి తాపత్రయ పడుతున్నానంటే తల్లిదండ్రులను, భర్తను, మేనమామను కోల్పోయి వైరాగ్యంతో జీవిస్తున్న నాగమ్మ మంత్రి పదవి కొరకు ఆశపడిందంటే నా మనసు అంగీకరించడం లేదు. 

        అలాంటి నాగమ్మ ఏడు ఘడియల పాటు ప్రధానమంత్రి పదవి ఇమ్మని అడిగిందనే రచయితలు రాశారు. 

       నిజానికి పదవీ కాంక్ష ను నాగమ్మ కలిగి వుంటే రాజు అనుమతి ఇచ్చిన తక్షణమే పదవిని స్వీకరించివుండేది. కానీ తనకు ఇష్టమైనప్పుడు పదవి తీసుకుంటానని చెప్పింది. 

      ఇక్కడ నాగమ్మ కోరిక కంటే అనుగురాజు  వత్తిడి చేసినట్లుగానే కనిపిస్తుంది. మంత్రి పదవి స్వీకరించమంటే సమయమొచ్చినప్పుడు స్వీకరిస్తానని నాగమ్మ అని వుండవచ్చు. నీకు ఇష్టమొచ్చినప్పుడు నా వారసులు ఎవరు వున్నా నాగమ్మకు ఏడు ఘడియల పాటు మంత్రి పదవి ఇవ్వాలని దాన పత్రం లేదా ఫర్మానా రాసి ఇచ్చాడు అనుగురాజు. ఇక్కడ దాన పత్రం రాసి ఇచ్చినది అనుగురాజు కాదు నలగామరాజేనని కొంతమంది రచయితలు రాశారు. కానీ అది వాస్తవం కాదు నాగమ్మకు అనుమతి పత్రం రాసి ఇచ్చినది అనుగురాజేనన్నది వాస్తవం.

      అలా మంత్రి పదవి వద్దని తిరస్కరించిన నాగమ్మ ఏ పరిస్థితిలో మంత్రి పదవి తీసుకుంది చరిత్రలో తొలి మహిళ మంత్రిణిగా ఎలా తన కీర్తిని సుస్థిరం చేసుకుంది? 

                                                               తరువాయి టపాలో చర్చిద్దాం....                                     

1, డిసెంబర్ 2014, సోమవారం

అనుగురాజు మరణం ఒక మిస్టరీ....(నాయకురాలు నాగమ్మ-3)



         అనుగురాజు మరణం గురించి మౌఖిక కథల్లోనూ చాలమంది రచయితల కథల్లోనూ ఈ విధంగా రాశారు. 

     బ్రహ్మనాయుడు సింహాసనానికి నమస్కరించాడు... వెంటనే సింహాసనం పేలిపోయింది. పగిలిపోయిన సిమ్హాసనం లో నుండి ఒక ముక్క ఎగిరి వచ్చి అనుగురాజును తగిలింది దానితో అనుగురాజు మరణించాడు. ఇది మనమయితే నిజంగానే నమ్మము. కానీ బ్రహ్మనాయుడిని విష్ణువాంశ సంభూతునిగా భావించే ప్రజలు మాత్రం నమ్మారు. కాదు బ్రహ్మనాయుడి స్వంతమీడియా నమ్మించింది. 

     నిజానికి అనుగు రాజు మరణించే నాటికి నలగామరాజుకు 13 సంవత్సరాలు. అంటే పెంపుదు కొడుకు బాదరాజు బహుశా యువకుడై వుండవచ్చు. బ్రహ్మనాయుడు కూడా యవ్వనంలో వుండివుండవచ్చు. తండ్రి దొడ్డనాయుడు తదనంతరం బాదరాజు మంత్రి కావాలి కానీ బ్రహ్మనాయుడు మంత్రి అయ్యాడు అంటే ఇక్కడ బాదరాజు ఎందుకు మంత్రి కాలేక పొయాడు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బాదరాజు చనిపోయి అయినా వుండాలి లేదా పదవి వద్దు అని ప్రక్కకు తప్పుకుని అయినా వుండాలి. ఈ క్రమంలో మంత్రి పదవి దక్కించుకున్న బ్రహ్మనాయుడు తండ్రిని, అన్నను హతమార్చి వుంటాడా? చాలామంది రచయితలు అన్నను తండ్రిని హతమార్చి మంత్రి అయ్యాడనే రాశారు. ఇది అంతగా మనం నమ్మాల్సినంత అవసరం లేదేమో... ఏది ఏమైనా తండ్రి, అన్న ల అడ్డు తొలగిన తరువాతనే బ్రహ్మనాయుడు మంత్రి అయ్యాడన్నది వాస్తవం. 

        ఈ నేపధ్యం లో అనుగురాజు మరణం మాత్రం మిస్టరీ గానే మిగిలింది. వాస్తవానికి అనుగురాజుకు వేట అంటే ప్రాణం. ఒక సారి వేటకు వెళ్ళిన సమయంలో వెనుక నుండి ఒక సైనికుడు వేసిన బాణం గురితప్పి అనుగురాజుకు తగిలి మరణించాడు. ఆ వేట సమయం లో బ్రహ్మనాయుడు కూడా అదే బృందంలో వున్నాడు. తన అనుచరుడి ద్వారా బాణం వేయించి అనుగురాజును హత్య చేయించాడనే ఆరోపణలు వున్నాయి. ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు "నమస్కారం పేలిపోయిన సిం హాసనం" అంటూ కట్టు కథలు కల్పించారు. ఎవరిపైనా అనుమానం లేని అనుగురాజు జరిగింది నిజంగా ప్రమాదమేనని నమ్మాడు. తన పిల్లలు చిన్న వారని వారి బాధ్యతలు పట్టించుకోవాలని బ్రహ్మనాయుదిని ఆదేశించి చనిపోయాడు. ఈ నిజం తరువాత నిలకడమీద తెలిసి వుంటుంది. 

    ఈ సంఘటనను బట్టి బ్రహ్మనాయుడు మొదటి నుండీ పథకాలు పన్నడంలో మాంచి ఘటికుడే నని అర్థమవుతోంది.

     అలా రాజ్యం పై బ్రహ్మనాయుడు పెద్దరికాన్ని సంపాదించుకున్నాడు. గురజాల సిం హాసనం పై పేరుకు నలగామ రాజు కూర్చున్నప్పటికీ పెత్తనం మాత్రం బ్రహ్మనాయుడే చలాయించాడు. 

     అనుగు రాజు రెండవ భార్య భూరమాదేవికి నలుగురు కుమారులు కామరాజు, నరసింగరాజు, జెట్టి రాజు, పెరుమాళ్ళు రాజులు.

      పెద్ద భార్య వీరవిద్యల దేవికి ముగ్గురు కుమారులు పెద్ద మల్లదేవుడు, పినమల్లిదేవుడు, బాల మల్లిదేవుడు. వీరందరూ చాల చిన్నవారు. ఇలా  ఈ పిల్లలందరూ పెద్దవారయ్యేనాటికి రాజ్యం మొత్తం బ్రహ్మనాయుడి గుప్పిటిలోనే వుంది. పేరుకు రాజు నలగాముడే అయినప్పటికీ మొత్తం పరిపాలన అంతా బ్రహ్మనాయుడే నడిపించాడు. ఈ క్రమంలో బ్రహ్మనాయుడికి అత్యంత సన్నిహితులు, మిత్రబృందాలూ ఏర్పడ్డాయి. మామూలే కదా అధికారం ఎక్కడ వుంటే ఈగలు కూడా అక్కడే వుంటాయి!!! 

     ఇలా ఎలాంటి అడ్డంకులూ లేకుండా పరిపాలన సాగుతుండగా...రాజ్యంలో విపరీతంగా దొంగతనాలు, దారిదోపిడీలు విపరీతంగా జరగడం మొదలయ్యాయి. వ్యాపారులు సంతలలో వ్యాపారాలు చేసుకోలేక పోయారు. ఎక్కడి బండ్లను అక్కడే అటకాయించి దొంగలు యథేచ్చగా దోచుకుంటున్నారు. వ్యాపారులు మొదట మంత్రిగారికి ఫిర్యాదు చేశారు. ఫలితం లేదు నేరుగా రాజుగారికే ఫిర్యాదు చేశారు కానీ ఆయన మంత్రి గారినే పురమాయించడంతో పరిస్థితి యథాతథంగానే ఉండిపోయింది. ఈ పరిస్థితిలో   ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని వ్యాపారులు,వృత్తుల వారు, ప్రజలు నాగమ్మను ఆశ్రయించారు. ఈ దొంగతనాల వెనుక బ్రహ్మనాయుడి అనుచరుల హస్తం ఉందని అందుకే బ్రహ్మనాయుడు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఎలాగయినా తమను కాపాడమని ఆమెను ప్రాధేయ పడ్డారు. 

       రాజు, మహామంత్రుల మీదనే నాగమ్మకు ప్రజలు ఫిర్యాదులు చేశారంటే అసలు ఎవరు ఈ నాగమ్మ??? ఈ నాగమ్మకు ఉన్న అధికారమేంటి??? ఒక వితంతువు పైన ప్రజలకు ఇంత నమ్మకమేంటి???  

                                      ....    తదుపరి టపాలో పరిశీలిద్దాం.  .....